సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ పద్దు కింద రూ.457.10 కోట్లు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రగతి పద్దు కింద మరో రూ.80 కోట్లు కేటాయించారు. మొత్తం 537.10 కోట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి నిర్వహణ పద్దు రూ.39.04 కోట్లు అదనంగా కేటాయించారు. అంతేకాకుండా ఉస్మానియా, జేఎన్టీయూ, బీఆర్ అంబేద్కర్, జేఎన్యూఎఫ్ఏ యూనివర్సిటీల అభివృద్ధికి మరో రూ.500 కోట్లు కేటాయించారు.
రూ.80 కోట్లతో మౌలిక వసతులు
ఓయూలో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన రూ.80 కోట్లతో హాస్టల్ నిర్మాణం, సివిల్ సర్వీసెస్ అకాడమి, నాలుగు పీజీ కాలేజీలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, యూనివర్సిటీలలో రోడ్డు తదితర వాటికి వినియోగించనున్నారు.
మహిళా యూనివర్సిటీకి రూ.100 కోట్లు
కోఠిలోని మహిళా యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించారు. వీటితో యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, అడ్మినిస్ట్రేషన్ భవనం, వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు.
సిటీ కాలేజీకి రూ.10 కోట్లు..
వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిటీ కాలేజీ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. అకాడమిక్ బ్లాకులు, కాలేజీ మరమ్మతులు, అదనపు తరగతి గదులు, సభలు, సమావేశాల నిర్వహణకు వినియోగించనున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.537.10 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్కు, ఆర్థిక మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. విద్యార్థులు కోరుకునే విధంగా కాకుండా.. యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే పీహెచ్డీ అడ్మిషన్లు నిర్వహిస్తాం.
– ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్
మెట్రో ప్రాజెక్ట్కు రూ.2500 కోట్లు
సిటీబ్యూరో,ఫిబ్రవరి 6 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో హెచ్ఎండీఏ పరిధిలోని అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయించింది. మెట్రో ప్రాజెక్టులకు నిధుల వరద.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో మంచి కేటాయింపులు చేశారు. ఇందులో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం హెచ్ఎంఆర్కు రుణాల ద్వారా సమకూర్చునేందుకు రూ.1500.00 కోట్లు, అదేవిధంగా ఇటీవల కొత్తగా ప్రారంభించిన హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ మార్గం నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించగా, పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం మరో రూ.500 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. మొత్తంగా ఈసారి బడ్జెట్ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంతృప్తికరమైన కేటాయింపులు చేశారని మెట్రో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి పనులను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నిర్వహిస్తున్నది.
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
సుల్తాన్బజార్, ఫిబ్రవరి 6: దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యానికి ఈహెచ్ఎస్ను ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ అన్నారు. సోమవారం నాంపల్లి గృహకల్ప ఆవరణలోని జిల్లా శాఖ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి విక్రమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు రాజ్కుమార్, ఉపాధ్యక్షులు కురాడి శ్రీనివాస్, మురళీరాజ్, సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, సభ్యులు శంకర్, సుజాత, గీతాసింగ్, జానకి, ఎంఏ ముజీబ్, తదితరులు పాల్గొన్నారు.
ఈహెచ్ఎస్ పథకం ఉద్యోగులకు వరం
ఈహెచ్ఎస్ పథకంతో ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక శాతం చందాతో నగదు రహిత ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో ఉద్యోగుల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.
-ముత్యాల సత్యనారాయణ గౌడ్, బీటీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు
‘తెలంగాణ హెల్త్ కేర్ బడ్జెట్’
హెల్త్ కేర్పై తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అద్భుతం. వైద్యశాఖకు రూ.12,161కోట్లు కేటాయించడం గొప్పవిషయం. ఈసారి 8శాతం పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు వైద్యవిద్యను తీసుకురావడానికి, ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల స్థాపించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం.
– కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని
నగరాభివృద్ధికి పెద్ద పీట
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధికి పెద్ద పీట వేసింది. ప్రజల ఆశలు, ఆశయాలను పూర్తి స్థాయిలో నెరవేర్చేదిశగా ఉంది. సుంకిశాల పథకానికి రూ.725కోట్లు, మొత్తంగా జలమండలికి రూ.1960 కోట్లు, మెట్రోకు రూ.2500 కోట్లు, దళితబంధుకు రూ.17,700కోట్లు, సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో గ్రేటర్ పరిధిలోని పేదలకు ప్రయోజనకరంగా ఉంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలు, దూరదృష్టి, పక్కా ప్రణాళికలతో నగరం మరింత అభివృద్ధి సాధించనున్నది.
– మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
ఉద్యోగులకు ఆరోగ్య భద్రత
ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడుతున్న ఏకైక సీఎం కేసీఆర్. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ కుటుంబాల ఆరోగ్య భద్రత కల్పించేందుకు అసెంబ్లీ సాక్షిగా రూ.700 కోట్లు కేటాయించడం హర్షణీయం.
-సల్వది శ్రీరాం, టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు
రాష్ట్ర బడ్జెట్ దేశానికే ఆదర్శం
అభివృద్ధి, సంక్షేమానికి పెట్టపీట వేస్తూ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. అన్ని వర్గాల కలలను సాకారం చేసేలా బడ్జెట్ను రూపొందించడం హర్షణీయం. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తూ వ్యవసాయంతో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేశారు. విద్యా రంగానికి రూ.19,093 కోట్లు కేటాయించడం అభినందనీయం.
– డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్