NIMS | ఖైరతాబాద్: వేలాది మంది రోగులు, వందలాది మంది వైద్య సిబ్బంది….24/7 సెక్యూరిటీ గార్డుల పహారా…అన్నింటినీ దాటుకుంటూ.. అగ్ని ప్రమాదకారకాలైన పటాకులు నిమ్స్ ఆస్పత్రికి చేరాయి. ఎమర్జెన్సీ వార్డులోని ఆడిటోరియంకు ఆనుకొని ఉన్న ఆరోగ్యశ్రీ కార్యాలయంలో స్టాకుగా ఉన్నాయి. శనివారం ఆడిటోరియంలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఈ భద్రతా వైఫల్యం బయటపడింది. ఈఎండీ వార్డులోనే పల్మనాలజీ, వాస్కూలర్, న్యూరో సర్జరీ, ఐసీయూ తదితర విభాగాలు ఉన్నాయి. మంటలు వ్యాపించి పటాకుల స్టాకుగా ఉన్న గది వరకు చేరి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం 3,500 మంది రోగులు వివిధ చికిత్సల కోసం నిమ్స్ ఆస్పత్రికి వస్తుంటారు.
డైరెక్టర్తో సహా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వివిధ విభాగాలకు చెందిన నిష్ణాతులైన వైద్యులు నిత్యం రోగులకు వైద్య సేవలందించడంలోనే తలమునకలవుతారు. ఈ నేపథ్యంలో అందరి భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ పటాకులు దర్శనమిచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగిన క్రమంలో స్వయంగా నిమ్స్ వైద్యాధికారి పటాకుల విషయంలో విచారణ చేయాలని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు ప్రారంభించారు.
నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులోని ఐదో అంతస్తులోని ఆడిటోరియంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ ఎస్టింగ్యూషర్లతో మంటలను ఆర్పివేశారు. అదే క్రమంలో దానికి ఆనుకొని ఉన్న ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పటాకులు బయటపడ్డాయి. సిబ్బంది..పటాకులు ఎవరు తెచ్చారని ఆరా తీస్తే..అందరి నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. పటాకుల విషయంపై నిమ్స్ వైద్యాధికారి ఒకరు పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల బృందం నిమ్స్లోని సదరు కార్యాలయానికి వచ్చి పరిశీలించగా, అవి మాయమయ్యాయి. అసలు తెచ్చిందేవరూ….మాయం చేసిందెవరూ….దీని వెనుక ఉన్నదెవరూ….24 గంటల్లో ఎలా మాయమయ్యాయి….తెచ్చిన వారే మాయం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కాగా, నిమ్స్లో జరిగిన అగ్ని ప్రమాదంపై నేషనల్ హెల్త్ మిషన్ కమిషనర్, ఆరోగ్యశ్రీ సీఈవో ఆర్వీ కర్నన్ ఆదివారం ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్పతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
సిటీబ్యూరో/ఖైరతాబాద్:నిమ్స్ ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు కాల్చి సగంలో పారేసిన సిగరెట్టె కారణమని పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలంలో విచారణ జరుపుతున్న సందర్భంలో సిగరెట్ ప్యాకెట్లు, కాల్చిపడేసిన సిగరెట్ ముక్కలు, బీడీలు, చెత్త కనిపించాయి. ఈ నేపథ్యంలో సిగరెట్, చెత్తతోనే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. నిమ్స్లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఘటనకు లిఫ్ట్ పక్కననున్న చెత్తలో తాగి పారేసిన బీడీలు, సిగరెట్ కారణమని పోలీసుల తేల్చారు. ఖాళీగా ఉన్న స్థలంలో కొంతమంది సిబ్బంది చెత్తను వేయడంతో పాటు సిగరెట్ తాగి అక్కడ పడేశారు. అక్కడ ఉన్న బీడి ముక్కలు, సిగరెట్లలో నుంచి నిప్పు పడడంతో చెత్త అంటుకుని మంటలు చెలరేగాయి. అది పైనున్న విద్యుత్ వైర్లకు అంటుకుని మంటలు వ్యాపించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.