మణికొండ, జూలై 7 : భవనం పైనుంచి పడి ఓ సినీ నిర్మాత మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కోకాపేట మూవీ టవర్స్లో నివాసముండే జి.రాజేంద్రప్రసాద్(87) గురువారం ఉదయం 16వ అంతస్తులోని తన ఇంట్లోని వీల్చైర్పై బాల్కనిలోకి వచ్చి అక్కడ నుంచి కిందపడి మృతి చెందాడు.
గత కొన్నిరోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన కూతురు రజినీసాగర్ తెలిపారు. గతంలోనూ కడుపు నొప్పిని భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తనతో చెప్పేవారని ఆమె అన్నారు. మృతుడు రాజేంద్రప్రసాద్ సుమారు 25 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.