Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన కుమార్తెను గొంతు కోసి చంపాడు. ఈ ఘటన చందానగర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చంద్రశేఖర్, హిమ అనే దంపతులు 12 ఏండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 8 ఏండ్ల కూతురు మోక్షజ ఉంది. అయితే భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కాగా గతేడాది చంద్రశేఖర్ ఉద్యోగం కోల్పోయాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్, హిమ మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో కొద్ది రోజుల క్రితం తన బిడ్డను తీసుకుని హిమ తన పుట్టింటి వెళ్లిపోయింది.
ఇక తనకు భార్య దూరంగా ఉంటుందన్న కోపంతో.. ఇవాళ కూతుర్ని గొంతు కోసి చంపాడు. అనంతరం డెడ్బాడీని తన కారులో అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ఆర్ వైపు తీసుకెళ్లి.. చెట్లలో విసిరేయాలనుకున్నాడు. కానీ అంతలోనే కారు ప్రమాదానికి గురైంది. దీంతో గస్తీ పోలీసులు అప్రమత్తమై ఆ కారు వద్దకు వెళ్లగా.. వెనుక సీట్లో బాలిక మృతదేహం లభ్యమైంది. చంద్రశేఖర్ను అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తానే తన బిడ్డను చంపానని పోలీసుల ఎదుట అంగీకరించాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ నడిపిన కారు నంబర్ ఏపీ 28 డీడబ్ల్యూ 4667. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.