సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపుతున్న రాచకొండ పోలీసులు ఒకే రోజు రెండు వేర్వేరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాలను పట్టుకున్నారు. ఈ ముఠాలకు చెందిన 7మంది సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువైన 270 కిలోల గంజాయి, కార్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్.చౌహాన్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన రాకేశ్ చౌహాన్(25), బజరంగ్సింగ్(43), పవన్ (23), సమెర్ రామ్(33)లు ఒక ముఠాగా ఏర్పడి ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, రాజస్థాన్లో కిలో రూ.20వేలు చొప్పున విక్రయిస్తారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు కలిసి కారులో ఒడిశాకు వెళ్లి అక్కడ 200కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కారు నంబర్ ప్లేట్ సరిగా కనిపించకుండా ఫాంట్ను మార్చారు. నగరంలోని అబ్దుల్లాపూర్మెట్ చేరుకోగానే సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో కలిసి నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.45లక్షల విలువ చేసే 200కిలోల గంజాయి, కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
మరో కేసులో….
మహారాష్ట్రకు చెందిన దేవరాజ్ తేజు పవార్(23), సచిన్ సుభాష్ షిండే(35)లు సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నారు. నిందితులిద్దరూ రెండు రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి విశాఖపట్నంలోని అరకుకు వెళ్లి, 70కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం కారులో గంజాయిని మహారాష్ట్ర తరలించే క్రమంలో నగర శివారులోని జూలూరు ఎక్స్రోడ్కు తరలించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు, పోచంపల్లి పోలీసులతో కలిసి నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.15లక్షల విలువ చేసే 70కిలోల గంజాయి, కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.