Cyberabad Police | బంజారాహిల్స్,జూన్ 3: వినికిడి సమస్యతో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు ఉపయోగించే ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్ పరికరం రద్దీ రోడ్డులో పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన బాలుడి కుటుంబసభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్లో నివాసం ఉంటున్న బాలుడు(4)కి వినికిడి సమస్యలు ఉండటంతో ఇటీవల కుటుంబసభ్యులు రూ.6.2లక్షల ఖరీదైన కాంక్లియర్ ఇంప్లాంట్(వినికిడి పరికరం) అమర్చారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడికి సంబంధించిన కాక్లియర్ ఇంప్లాంట్ ఎక్కడో పడిపోయింది. సుమారు గంట తర్వాత ఇంట్లోకి వచ్చిన బాలుడిని గమనించిన కుటుంబసభ్యులు అతడి చెవిలో ఉండాల్సిన పరికరం కనిపించకపోవడంతో వెతికారు. ఫలితం లేకపోవడంతో ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఇంటికి సమీపంలో ఉన్న రోడ్డుతో పాటు సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టారు.
డిజిటల్ చెల్లింపు వివరాల ఆధారంగా..
కాగా బాలుడు నివాసం ఉంటున్న ఇంటికి కిందనే సందీప్ కిరాణా స్టోర్స్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో ఎదురుగా ఉన్న జ్యూస్ సెంటర్ వద్ద తండ్రితో కలిసి జ్యూస్ తాగేందుకు వచ్చిన బాలుడు రోడ్డుపై పడిన పరికరాన్ని గుర్తించి అడుకునే వస్తువుగా భావించి తీసుకెళ్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో జ్యూస్ సెంటర్ యజమాని వద్దకు వెళ్లిన పోలీసులు ఆ సమయంలో వచ్చిన వారి గురించి ఆరా తీశారు. తాను బాలుడికి జ్యూస్ ఇచ్చిన మాట వాస్తవమే అని, దానికోసం స్కానర్ ద్వారా బిల్లు చెల్లించినట్లు తెలిపాడు. దీంతో ఉదయం 10నుంచి 11గంటల మధ్య డిజిటల్ చెల్లింపులు చేసిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేశారు. అలాగే జ్యూస్ సెంటర్కు వచ్చారా అని అడుగుతూ బాలుడి తండ్రికి కూడా ఫోన్ చేశారు. దీంతో తన కొడుకును పిలిచి వాకబు చేయగా రోడ్డుపై ఆడుకునే వస్తువు దొరికిందని తాను జేబులో వేసుకున్నానని చెప్పాడు. దీంతో పోగొట్టుకున్న కాక్లియర్ ఇంప్లాంట్ పరికరాన్ని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. రెండు గంటల వ్యవధిలోనే అత్యంత చాకచక్యంగా ఖరీదైన పరికరాన్ని కనుగొని బాలుడి తల్లిదండ్రులకు అప్పగించిన ఫిలింనగర్ పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు.