బంజారాహిల్స్,ఫిబ్రవరి 20 : సేల్స్మెన్ను దృష్టి మరల్చి ఖరీదైన పట్టుచీరలతో(Silk sarees) ఉడాయించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ముగ్దా షోరూమ్లోకి(Mugda Showroom) ఈనెల 18న సాయంత్రం కొంతమంది గుర్తుతెలియని మహిళలు షాపింగ్ కోసం వచ్చారు. పెళ్లి కూతురు కోసం చీరలు కావాలని కాసేపు వెతికి ఒక చీరను సెలెక్ట్ చేశారు.
బిల్ కౌంటర్వద్దకు ఒకరు వెళ్లి తమకు 15శాతం డిస్కౌంట్ కావాలని అడిగారు. అయితే 10శాతం మాత్రమే డిస్కౌంట్ ఇవ్వగలమని సేల్స్మెన్ చెప్పడంతో తమకు చీర అక్కర్లేదని వచ్చిన వారంతా బయటకు వెళ్లిపోయారు. దాంతో చీరను వెనక్కితీసుకువచ్చిన సేల్స్మెన్ టేబుల్మీద చూడగా మూడు ఖరీదైన పట్టుచీరలు కనిపించలేదు.
దీంతో షాపులోని సీసీ ఫుటేజీను పరిశీలించగా వచ్చినవారిలో ఒక మహిళ మూడుచీరలు తీసుకుని షాపులోనుంచి ఉడాయిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ మేరకు ఖరీదైన పట్టుచీరలు తస్కరించిన ముఠాపై చర్యలు తీసుకోవాలంటూ స్టోర్ మేనేజర్ సత్యచంద్ర మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.