మణికొండ, జూన్ 9: ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఆదివారం నార్సింగి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రమణ గౌడ్ వివరాలను వెల్లడించారు. కర్నూలుకు చెందిన శేషు వర్ధన్రెడ్డి (37) తన కుటుంబ సభ్యులతో కలిసి హైదర్షాకోట్లోని ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అతడు గోల్డ్, ఎలక్ట్రానిక్ వ్యాపారాలు చేస్తున్నాడు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో కర్నూల్కు చెందిన అందే క్రాంతికుమార్(36)తో విబేధాలు ఉన్నాయి. శేషు వర్ధన్రెడ్డి నుంచి క్రాంతికుమార్కు డబ్బులు రావాల్సి ఉంది. డబ్బులు అడిగిన ప్రతిసారి రేపుమాపు అంటూ దాట వేస్తున్నాడు. ఎన్ని రోజులైనా తనకు డబ్బులు ఇవ్వడని కక్ష పెంచుకున్న క్రాంతికుమార్.. ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. కిడ్నాప్ చేసి.. బెదిరించి డబ్బులు తీసుకోవాలని తన స్నేహితుడైన కె. సందీప్ (36)కు విషయాన్ని తెలిపి సహాయం కోరాడు.
ఈ నెల 8న రాత్రి నార్సింగి రోటరీ వద్ద శేషు వర్ధన్రెడ్డి తన వ్యాపార భాగస్వామి కారులో ప్రయాణిస్తున్నాడు. అప్పటికే కిడ్నాప్ చేసేందుకు మాటు వేసి ఉన్న క్రాంతికుమార్, సందీప్ కలిసి కారులో వేచి ఉన్నారు. శేషు వర్ధన్రెడ్డి రాగానే.. కారులోకి వెళ్లి పిడిగుద్దులు గుద్ది.. దాడి చేశారు. అలాగే, నిందితులు తమ కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనను స్థానికులు గమనించి 100 నంబర్కు ఫోన్చేసి సమాచారం అందించారన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. శేషు వర్ధన్రెడ్డిని నిందితులు కర్నూలు వైపు తీసుకువెళ్తున్నారని స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల సహాయంతో గుర్తించిన పోలీసులు, ఆ మార్గంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. మహబూబ్నగర్ పరిధిలోని అడ్డాకుల టోల్ గేట్ వద్ద అడ్డాకుల పోలీసులు నిందితుల కారును పట్టుకుని విచారించారు. నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.