బడంగ్పేట, సెప్టెంబర్ 11: మీర్పేట ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మన ఊరు-మన బడితో మహర్దశ వచ్చింది. నూతన హంగులతో భవనాలను తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసింది. మీర్పేటలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12.32 లక్షలు కేటాయించడంతో చకచక పనులు జరుగుతున్నాయి. విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది. బాలాపూర్ మండలంలోని 13 ప్రభుత్వ పాఠశాలలను మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి చేయిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు.
పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి..
మీర్పేటలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రూపు రేఖలు మార్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నది. మనఊరు-మనబడి కింది కేటాయించిన నిధులతో ఫ్లోరింగ్, కిచన్, లీకేజీలు, మెట్లు, బెంచీలు, కుర్చీలు, కలర్, వాల్ పెయింటింగ్, ప్రహరీ నిర్మాణం, టాయిలెట్స్, మంచినీటి సంపుల నిర్మాణం, ఎలక్ట్రిసిటీ తదితర పనులను చేయించారు. పాఠశాల గ్రౌండ్ను క్లీన్ చేయించారు.
నూతన హంగులతో..
శిథిలావస్థలో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాలను నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలలో కిచన్ షెడ్డు లేకపోవడంతో ప్రత్యేకంగా షెడ్డును ఏర్పాటు చేశారు. పాఠశాలలోకి ఎవరూ రాకుండా చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి, పెయింటింగ్ వేయించారు. ఉదయం పాఠశాల, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అదే పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను కొనసాగుతున్నది.
హరితహారం ఫలితాలు..
హరితహారం కింద నాటిన మొక్కలు పాఠశాలలో ఏపుగా పెరిగాయి. పచ్చదనాన్ని పంచడమేకాకుండా విద్యార్థులకు నీడనిస్తున్నాయి. చెట్ల కింద విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నారు. హరిత హారంలో నాటిన మొక్కలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. నాటిన ప్రతి మొక్కను ఉపాధ్యాయులు, విద్యార్థులు సంరక్షించారు. దీంతో ఆ మొక్కలు చెట్లుగా మారాయి.
అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. మన ఊరు-మన బడి కింద ముఖ్యమత్రి కేసీఆర్ కోట్ల రూపాయలు కేటాయించారు. నూతన హంగులతో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీర్పేట ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరిస్తున్నాం. రూ.12.32 లక్షలు కేటాయించాం. మీర్పేట పాఠశాలలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా ఉండటానికి అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించాం.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది
ప్రభుత్వం మనఊరు-మనబడి పేరుతో మంచి నిర్ణయం తీసుకున్నది. పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించింది. బాలాపూర్ మండలంలోని 13 పాఠశాలలను మనఊరు-మనబడి ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడానికి మౌలిక సదుపాయల కల్పన దోహదపడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంచి నిర్ణయం తీసుకోవడం వలన ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి.
– కృష్ణయ్య, ఎంఈవో