సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ ) : 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను జీహెచ్ఎంసీలో రిజల్ట్ ఓరియెంటెడ్గా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో జయేష్ రంజన్ అధ్యక్షతన మొట్టమొదటి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ సమావేశం జరిగింది. గత జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిటీ అమోదం తెలిపింది.
అనంతరం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రణాళికపై అధికారులకు జయేష్ రంజన్ దిశా నిర్దేశం చేశారు. 14 వారాల పాటు జరగనున్న ఈ కార్యక్రమం ఒకో వారం ఒకో థీమ్తో జరగనుందని వివరించారు. పారిశుధ్యంతో మొదటి వారం ప్రారంభమై విద్య, వైద్యం, మహిళా, రైతు, యువత, పర్యావరణం తదితర థీమ్లతో జరగనుందన్నారు. మొదటి వారం పారిశుధ్యం పేరుతో జరిగే కార్యక్రమంలో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించి తొలగించాలన్నారు. ఇష్టారీతిన చెత్తను వేసే వారిపై జరిమానాలు విధించడం, ఈ – వేస్ట్ సేకరణ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రభావంతంగా చేపట్టాలన్నారు. యూత్ వీక్లో యువతలో నైపుణ్యాల అభివృద్ధి పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యాంటీ డ్రగ్ చైతన్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు.