ఖైరతాబాద్, డిసెంబర్ 6 : జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర స్థాయి చెకుముఖి సైన్స్ సంబురాలు నిర్వహిస్తున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కోయ వెంకటేశ్వర్ రావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంబురాలకు సంబంధించిన పోస్టర్లను ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆదినారాయణ, ప్రొఫెసర్ బీఎన్ రెడ్డి, కార్యదర్శి ఎన్. వెంకట్రాం రెడ్డి, అందె సత్యం, వరప్రసాద్తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని రంగినేని సుజాతా మోహన్ రావు ఎడ్యూకేషన్ అండ్ చారిటుబల్ ట్రస్ట్లో నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రాత పరీక్ష, యాక్టివిటీ రౌండ్, క్విజ్, సైన్స్ ప్రయోగాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. సైన్స్ సెమినార్లు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆకాశ దర్శనం, సైన్స్ ఎగ్జిబిషన్, మిరాకిల్ ఎక్స్పోజర్, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ మ్యాజిక్, గేమ్స్, చరిత్రగతిని మార్చిన శాస్త్రవేత్తల ఎగ్జిబిషన్, వివిధ ప్రతిభా పాటవ పోటీలు, ఫీల్డ్ ట్రిప్, పుస్తక ప్రదర్శన, సైన్స్ కార్నివాల్, స్ట్రీట్ సైన్స్ షోలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాజా, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.