Gandhi Hospital | బన్సీలాల్పేట్, ఏప్రిల్ 18 : గాంధీ దవాఖానాలో తొమ్మిది నెలల చిన్నారికి అరుదైన ఆపరేషన్ చేశారు. కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో నివసించే దంపతులకు జన్మించిన యాస్మిన్ బీ అనే 9 నెలల చిన్నారికి పుట్టుకతోనే కిడ్నిలకు కణితి ఉన్నట్టు గుర్తించారు. నగరంలోని బాలానగర్లో ఉండే అమ్మమ్మ ఇంటికి పాపను తీసుకుని రాగా, వారు గాంధీ దవాఖానలోని పీడీయాట్రిక్ సర్జరీ విభాగంలో చేర్పించారు.
హెచ్వోడీ ప్రొఫెసర్ కే.నాగార్జున ఈ కేసును పరిశీలించి రెండు కిడ్నీలకు కంతి (వైద్య రంగంలో విల్మ్స్ ట్యూమర్ అంటారు) సైజును పరిశీలించారు. పీడీయాట్రిక్ సర్జరీ విభాగం హెచ్వోడీ ప్రొఫెసర్ కే.నాగార్జున, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కవిమోజి ఇలక్కియా, డాక్టర్ రాజ్కిరణ్, డాక్టర్ ఫణింద్ర, అనస్థీషియా విభాగం డాక్టర్ మురళి, యూరాలజీ విభాగం ప్రొఫెసర్ రవిచందర్, ఇతర సిబ్బంది కలిసి ఎంతో శ్రమించి 15 రోజుల క్రితం ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.
పాప తల్లిదండ్రులు మంగళవారం గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావును కలిశారు. తన కుమార్తెకు పునర్జన్మ ఇచ్చిన గాంధీ దవాఖానకు, వైద్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వారు అన్నారు. దవాఖానాలో పీడీయాట్రిక్ వార్డు వసతులు చూసి ఆశ్చర్యపోయామని, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఉచితంగా మంచి వైద్యం లభించిందని, వారు సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.
నా కెరీర్లో అరుదైన కేసు
గాంధీ దవాఖానలో ఆరేండ్లుగా పీడీయాట్రిక్ సర్జరీ విభాగం హెచ్వోడీగా, నీలోఫర్ దవాఖానాలో 17 ఏండ్లు పని చేశాను. నా కెరీర్లో తొమ్మిది మాసాల బాలికకు రెండు కిడ్నీలకు కణితి (బైలాటరల్ నెఫ్రాన్ స్పేరింగ్ సర్జరీ) ఏర్పడడం చూశాను. ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా చిన్నారి ప్రాణాలకు ముప్పు. ముందుగా డాక్టర్లకే ధైర్యం ఉండదు. తోటి వైద్యుల సహకారంతో తల్లిదండ్రులను ఒప్పించి ఆపరేషన్ విజయవంతంగా చేశాం.
– ప్రొఫెసర్ కే.నాగార్జున, పీడియాట్రిక్ సర్జరీ హెచ్వోడీ