బంజారాహిల్స్, సెప్టెంబర్ 16 : ‘చదువును పక్కన పెట్టి తరచూ సెల్ఫోన్లో ఎందుకు చాటింగ్ చేస్తున్నావంటూ’ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్కు చెందిన సంజీబ్ మండల్ అనే ఎలక్ట్రీషియన్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నం.14లోని నూర్నగర్లో కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నాడు.
కాగా, సంజీబ్ మండల్ కుమార్తె ఇషికా మండల్(13) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. గత కొంతకాలంగా స్కూల్ నుంచి రాగానే ఇషికా మండల్ ఫోన్తో కాలక్షేపం చేస్తున్నది. వాట్సాప్లో చాటింగ్ చేయడంతోపాటు గేమ్స్ ఆడుతుండటంతో పలుమార్లు తల్లిదండ్రులు మందలించారు. శుక్రవారం స్కూల్ నుంచి వచ్చిన ఇషిక హోమ్వర్క్ కూడా చేయకుండా సెల్ఫోన్లో చాటింగ్ చేస్తున్నది. దీంతో తండ్రి సంజీబ్ మండల్తోపాటు తల్లి పూర్ణిమ ఆమెను తీవ్రస్థాయిలో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఇషిక గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.