దుండిగల్/సైదాబాద్, ఏప్రిల్ 17: కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేటలో ఉన్న ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనం(జువైనల్ హోం) నుంచి 8 మంది బాల నేరస్తులు తప్పించుకున్నారు. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పోలీసులు, సదనం సూపరింటెండెంట్ డి.సంఘమేశ్వర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రత్యేక సదనంలో 32 మంది బాలనేరస్తులు ఉన్నారు. వీరిలో మార్పు తెచ్చేందుకు పలు రకాల కోర్సుల్లో ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 11.45 గంటల సమయంలో 8 మంది మైనర్లు అధికారుల దృష్టి మళ్లించి సదనం నుంచి పారిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో సదనం సూపరింటెండెంట్ సంఘమేశ్వర్ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి, బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ శ్రీనివాస్రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశం, ఎస్ఐ నారాయణ సింగ్ తదితరులు బాలుర సదనాన్ని సందర్శించారు. బాల నేరస్తులు తప్పించుకున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
8 మంది బాల నేరస్తులు కిటకీ గ్రిల్ తొలగించి తరగతి గది నుంచి బయటకు దూకి పరిగెత్తారు. అక్కడి నుంచి ఉల్లాస్ దాబా వైపు ఉన్న ప్రహరీ పైనుంచి దూకి, ఎవరికీ దొరకకుండా అధికారుల కండ్ల ముందే పారిపోయారు. సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ముందుగా తల్లిదండ్రుల వద్ద సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఒక్కరు కూడా తమ సొంత ఇండ్లకు రాలేదని నిర్ధారించుకున్న తర్వాతే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.