ప్రభుత్వ ఖజానాలో డబ్బులేదు… చాలా పొదుపుగా ఖర్చు చేస్తాం… ఆడంబరాలు, అట్టహాసాలు ఉండవనే కాంగ్రెస్ ప్రభుత్వం… అప్పుడే ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టింది. కేవలం ఒక కార్యాలయంలో ఇంటీరియర్స్ కోసం ఒకే సారి రూ.79 లక్షలు వెచ్చించనుంది. దీనికి టెండర్లను కూడా ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పిలిచింది. ఇప్పటికే సకల సౌకర్యాలతో కొనసాగుతున్న కార్యాలయాన్ని పూర్తిగా తొలగించి, కొత్త కార్యాలయం ఏర్పాటుకు లక్షలు వెచ్చిస్తున్నారు. కేవలం ఫర్నిచర్తో చాంబర్లు, డెస్క్లు ఏర్పాటు చేసేందుకు ఆ స్థాయిలో ఖర్చవుతుందా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మునిసిపల్ శాఖ పరిధిలోని శాఖలోనే జరుగుతుండడం గమనార్హం.
నానక్రాంగూడ ఔటర్ రింగు రోడ్డు ఇంటర్చేంజ్ వద్ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రెండు భవనాలను నిర్మించి, అందులో ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అందులో ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు భూసేకరణ విభాగం కార్యాలయం కొనసాగుతుండగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు కలిగిన అధికారి చాంబర్తో పాటు అదనంగా మరో 3-4 ప్రత్యేక క్యాబిన్లు, ఇతర ఉద్యోగులకు అవసరమైన ఆధునిక ఫర్నిచర్తో కూడిన ఆఫీస్ ఉండేది. అలాంటి కార్యాలయాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
తార్నాకలో ఉన్న మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) కార్యాలయాన్ని నానక్రాంగూడకు తరలించాలనుకుంటే అందులో ఉన్న ఓఆర్ఆర్ ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లను అక్కడికి మారిస్తే సరిపోయేది. కానీ అలా చేయకుండా అందులో ఉన్న ఫర్నిచర్ తొలగించి మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయడమంటే దుబారా ఖర్చు కింద లెక్కేనని అభిప్రాయం వ్యక్తవుతోంది. నగరంలో ఒక చివర నుంచి మరో చివరి వరకు సుమారు 55 కి.మీ దూరం ఉన్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టును పర్యవేక్షించే ఎంఆర్డీసీఎల్ కార్యాలయం తార్నాకలో మూసీ దగ్గరగానే ఉంది. అలాంటి కార్యాలయాన్ని మూసీకి ఒక చివరన దూరంగా ఏర్పాటు చేయడం వల్ల ఏమిటీ ప్రయోజనమని ఆ సంస్థ ఉద్యోగులే వాపోతున్నారు. ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో మూసీ దగ్గరగా ఉంటూ పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎక్కడో ఒక మూలకు ఆఫీసులో ఉండడం సరైన నిర్ణయం కాదని ఉద్యోగులే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి దుబారా ఖర్చులు చేయకుండా మూసీ ప్రాజెక్టులు పనులు వేగంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.