సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కోకాపేట,బుద్వేల్ లేఅవుట్లలో ఆగస్టు 3,10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ వేలం ద్వారా మొత్తం రూ.6945.33 కోట్లు హెచ్ఎండీఏకు వచ్చిందని అధికారులు తెలిపారు. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో ఒక ఎకరానికి రూ. 100.75 కోట్ల మేర పలికి దేశంలోనే అత్యధిక ధరగా నమోదు చేసుకున్నది. కోలకతా నగరంలో ఎకరం సుమారు రూ. 72 కోట్ల మేర మాత్రమే పలికింది. రియల్ ఎస్టేట్ రంగంలోనే రికార్డుగా నిలిచిన ఎకరం ధర వంద కోట్లు అంశం సంచలనంగా మారింది. ఆగస్టు 3న జరిగిన కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో సర్వే నంబరు 239, 240లలో రెండో దశ కింద మొత్తం 45.33 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని ఏడు ప్లాట్లగా విక్రయించారు.
ఇందులో ప్లాట్ నం. 10లోని 3.6 ఎకరాలను ఎకరానికి రూ.100.75 కోట్ల చొప్పున మొత్తం రూ.370కోట్లకు హ్యాపీ, రాజపుష్పా రియల్టీ సంస్థలు సంయుక్తంగా అత్యధికంగా బిడ్ వేసి సొంతం చేసుకున్నారు. అలా మొత్తం 7 ప్లాట్లను ఆన్లైన్ విక్రయం ద్వారా వివిధ రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలు చేశాయి. దీంతో ఒకే రోజు రూ. 3319.60 కోట్లు ఆదాయం హెచ్ఎండీఏకు వచ్చింది. కాగా అప్పటి నుంచి రికార్డు స్థాయి పలికిన ప్లాట్లకు బిడ్డర్లు డబ్బులు చెల్లిస్తారా అన్న అనుమానం ఉండేది. అలాంటి సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఎకరానికి వందకోట్లు వెచ్చించి బిడ్ వేసిన కంపెనీతో పాటు కోకాపేట లేఅవుట్లో మొత్తం ప్లాట్లకు బిడ్ వేసిన వారంతా డబ్బులు చెల్లించారని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు డబ్బులు చెల్లించారని సంస్థ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
బుద్వేల్ లేఅవుట్ నుంచి రూ.3625.73 కోట్లు
కోకాపేట తర్వాత హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన బుద్వేల్ లేఅవుట్లో మొత్తం 14 ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించగా, అత్యధికంగా ఎకరానికి రూ.41.75 కోట్లు పలికింది. సరాసరిగా ఒక్కో ఎకరానికి 36.25 కోట్లు వచ్చాయి. ఆగస్టు 10న జరిగిన ఈ లేఅవుట్లో విక్రయించిన ప్లాట్ల ద్వారా మొత్తం రూ.3625.73 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసిన బిడ్డర్లు సైతం నిర్ణీత గడువులోగా పూర్తి స్థాయిలో చెల్లింపులు చేశారు.