సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ ): ఆభరణాల ఎక్స్పో నగరంలో కొలువుదీరింది. హెచ్ఐసీసీలోని నోవాటెల్లో శుక్రవారం జువెల్లరీ, పెరల్స్ అండ్ జెమ్స్ ఫెయిర్- 2023ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెమ్స్ అండ్ జువెల్లరీ రంగానికి అనువైన వాతావరణం, ప్రోత్సాహం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు. ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన 14 రంగాల్లో జెమ్స్ అండ్ జువెల్లరీ కూడా ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనా విధానం, బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలతో అన్ని రంగాలు వృద్ధిలో దూసుకుపోతున్నాయని కొనియాడారు.
తొమ్మిదేండ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని చెప్పారు. జెమ్స్ అండ్ జువెల్లరీ రంగంలో గతంలో కోర్టు కేసులు సహా పలు కారణాల రీత్యా ఆశించిన ప్రగతి లేదని చెప్పారు. ఇకపై ఈ సెక్టార్పై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ఇప్పటికే మలబార్ గోల్డ్ లాంటి సంస్థ నగరంలో తమ కార్యకలాపాలకు సన్నద్ధమైందని గుర్తు చేశారు. చిన్న, పెద్ద తరహా సంస్థలన్నీ నగరంలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రారంభించాలని కోరుతున్నామన్నారు. కార్యకలాపాలకు కావాల్సిన అన్ని వనరులను సమకూర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. తమ వర్షాప్లు, ఫ్యాక్టరీలు పెట్టే ఆభరణాల వర్తకులకు తగిన ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు.
అనంతరం ఇన్ ఫార్మా మారెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేశ్ ముద్రాస్ మాట్లాడుతూ.. తమ తొలి ప్రయాణం హైదరాబాద్లోనే ప్రారంభమైందని, గత 15 ఏండ్లుగా ఈ ప్రదర్శనను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శన యంగ్ డిజైనర్లకు చాలా మోటివేషనల్గా ఉంటుందని సూచించారు. రాబోయే పదేండ్లలో ఈ సెక్టార్ను అద్భుత ప్రగతిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అమెరికాలో ఉన్నప్పుడు ఇండియన్ ఎంబీసీ ప్రతినిధులు.. తెలుగు గ్రూప్ అమెరికాలో అతిపెద్ద గ్రూప్ అని చెప్పినట్టు తెలిపారు. ఇక్కడ విద్యావంతులు, ప్రొఫెషనల్స్, సాంకేతిక నిపుణులు ఇలా అన్ని రకాల మైండ్ పవర్స్ పుష్కలంగా ఉన్నాయని వివరించారు.
ఇండోనేషియా నుంచి కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. కాగా, ఈ సంవత్సరపు ప్రదర్శనలో దాదాపు 200 మందికి పైగా అగ్రశ్రేణి ఎగ్జిబిటర్లు తమ వినూత్నమైన డిజైన్లను ప్రదర్శించారు. సుమారు 8000 మంది వాణిజ్య కొనుగోలుదారులు పాల్గొన్నారు. దాదాపు 600 ఎక్స్క్లూజివ్ బ్రాండ్లు ఈ ఎక్స్పోలో దాదాపు ఒక లక్షకు పైగా తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఆదివారం వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బులియన్ , జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ అధ్యక్షులు జగదీశ్ పర్షాద్ వర్మ, ఐబీజేఏ జాతీయ ఉపాధ్యక్షులు చేతన్ మెహతా, ఇండోనేషియన్ ట్రేడ్ ప్రామోషన్ సెంటర్ (ఐటీపీసీ) డైరెక్టర్ నుగ్రోహో ప్రియో ప్రటోమో, హెచ్ఐజేఎంఏ కన్వీనర్ ముఖేశ్ అగర్వాల్, ఏఓజే డైరెక్టర్ సుమేశ్ వధేరా, ఎస్వీఏఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర జైన్, ఇన్ ఫార్మా మారెట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యోగేశ్ ముద్రాస్, ఇన్ ఫార్మా మారెట్స్ ఇండియా గ్రూప్ డైరెక్టర్ పల్లవి మెహ్రా తదితరులు పాల్గొన్నారు.