సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దూకుడు పెంచారు. ప్రతి 15 రోజులకు ఒక నిబంధనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముందుగా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆ తర్వాతే ఉల్లంఘనలపై జరిమానాలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు తెలిపారు.
ఇందులో భాగంగా నవంబర్ 1 నుంచి 15 వరకు.. ఈ 15 రోజుల్లో సిగ్నల్స్ వద్ద ఉన్న స్టాప్లైన్ ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో 5964 మంది వాహనదారులు స్టాప్లైన్ ఉల్లంఘనకు పాల్పడినట్లు వివరించారు. ప్రజలు, వాహనదారుల భద్రత కోసం రూపొందించిన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.