కంటోన్మెంట్, నవంబర్ 16: కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితకు 50 వేల మెజార్టీ ఖాయమని కంటోన్మెంట్ నియోజకవర్గ ఎన్నికల బీఆర్ఎస్ ఇన్చార్జ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్కు బాసులని, ఢిల్లీ పార్టీలతో ఒరిగేదేమీ లేదన్నారు. ఈ మేరకు గురువారం బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసానితో పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి ఎంఎన్ శ్రీనివాస్లు హాజరయ్యారు. మొదటగా దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి మంత్రి తలసాని నివాళులర్పించారు.
అనంతరం మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్, బీజేపీ నేత రుక్మయ్య, సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ గుప్తా, ఎంఐఎం నుంచి వాహబ్, అజ్జూ, ముక్రం తదితరులు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి తలసాని వాళ్లందరికీ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పార్టీలో చేరిన నేతలందరికీ సముచిత ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. బూత్ స్థాయి నేతలు ప్రతి ఇంటికీ తిరిగి సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించాలని సూచించారు. లాస్య నందితను సొంత బిడ్డలా భావించి ప్రతి ఒక్కరు ఆమె గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఇక నుంచి ప్రచారం మరింత ఉధృతంగా సాగుతుందన్నారు. ప్రతి వార్డులో కనీసం వెయ్యిమందితో పాదయాత్ర నిర్వహించాలని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. కంటోన్మెంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పట్టాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గెలిచేది లాస్య నందితనేనని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్ తెచ్చినన్ని పథకాలు మరే ప్రభుత్వం కూడా తీసుకురాలేదన్నారు. రూ. 1050 ఉన్న గ్యాస్ సిలిండర్ను సర్కారు అధికారంలోకి రాగానే రూ.400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తామని, రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా.. ఇంటింటికీ ధీమాను తీసుకొచ్చినట్లు చెప్పారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్, బీజేపీలకు క్యాడర్ లేదని, ఉన్నదంతా బీఆర్ఎస్ క్యాడరేనని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడన్నారు. ఈ నెల 21న కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో ఉంటుందని, ఈ నెల 25న పరేడ్ మైదానంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోకనాథం, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరి, నేతలు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్తో సహా పలు వార్డుల అధ్యక్షులు, ఆలయ కమిటీల సభ్యులు, పలువురు సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, యువ నాయకులు, మహిళా నేతలు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తా: లాస్య నందిత
ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత హామీ ఇచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నియోజకవర్గ ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి కాపాడుకుంటే, నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని చెప్పారు.