సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : విపత్తు సమయాల్లో ఆదుకునేందుకు ముందుండే ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతోంది. ప్రస్తుతం 27 బృందాలతో 450 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటల పాటు నిత్యం ముఖ్యమైన ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉంటూ విపత్తు నివారణ చర్యలు చేపడుతున్నది. అగ్నిప్రమాదం, కుండపోత వర్షాల సమయంలో అద్భుత పనితీరు కనబరిచి.. పౌరుల మన్ననలు అందుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో 50 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించి డీఆర్ఎఫ్ సిబ్బంది సంఖ్యను ఈవీడీఎం విభాగం పెంచుకున్నది. విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్న 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ 50 మందికి శిక్షణ అందించారు.
ఈ నెల 8వ తేదీ నుంచి 27వ వరకు మూడు వారాల పాటు బోట్ ఆపరేషన్, వరదల సమయంలో వ్యక్తులను రక్షించడం, భవనం కూలిన సమయంలో కాంక్రీట్ బ్లాక్లు, స్లాబ్ల కింద చిక్కుకున్న వ్యక్తులను రక్షించడంతో పాటు ప్రథమ చికిత్స అందించడం, సీపీఆర్ చేయడం, ఆపరేషన్ సెఫ్టీ, బోట్ హ్యాండ్లింగ్ తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది డీఆర్ఎఫ్ సిబ్బందికి అసిస్టెంట్ కమాండెంట్ దామోదర్ సింగ్, ఈవీడీఎం డైరెక్టర్ ఎన్.ప్రకాశ్ రెడ్డి శనివారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.