మాదాపూర్, ఏప్రిల్ 8: ఐదేండ్ల క్రితం హత్యాయత్నం కేసులో నిందితుడికి న్యాయ స్థానం ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మెహన్ కథనం ప్రకారం… 2023లో మాదాపూర్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేసి కోర్టుకు చార్జ్షీటును దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడు నేరం చేసినట్లు నిర్థారించింది.
వనస్థలిపూరంలోని ప్రశాంతి నగర్కు చెందిన రవీందర్ కుమారుడు తిరుపతి అనురాగ్ (25), అనిరుద్లు మాదాపూర్లోని వీఎఫ్ఎక్స్ స్టూడియో అయ్యప్ప సొసైటీ పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో పలుమార్లు గొడవ జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని జూలై 5, 2023న రాత్రి 9:15 గంటల సమయంలో తిరుపతి అనురాగ్ ఎలాగైన అనిరుద్ను చంపాలనే ఉద్ధేశ్యంతో మాదాపూర్లోని ఢీ మార్ట్లో కత్తిని కొనుగోలు చేసి వాళ్లు పనిచేసే ఆఫీసు దగ్గరలో ఉన్న టీ బ్రేవ్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుందాం రా అని పిలిచి తిరుపతి అనురాగ్ కత్తితో అనురుద్ మొఖం, ఛాతీ, మెడపై పలుమార్లు దాడి చేశాడు.
దీంతో అనిరుద్కు తీవ్ర గాయాలు కాగా తిరుపతి అనురాగ్ అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు సమీప దవాఖానాకు తరలించి చికిత్స అందించారు. ఈ కేసులో బాధితుడి తండ్రి మధుసూదనాస్వామి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్హెచ్వో ఎన్.తిరుపతి కేసు దర్యాప్తును రవికిరణ్కు అప్పగించగా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. బుధవారం కూకట్పల్లి 6వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి పావని, పీపీడీ ఉపేందర్ వాదనలు విన్న అనంతరం తిరుపతి అనురాగ్కు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది.