హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తన ఉదార స్వభావాన్ని చాటుకుంది. రోగుల వెంట వచ్చే సహాయకులకు ఆయా ఆస్పత్రుల వద్ద షెల్టర్లు కట్టించాలని చెప్పిన సీఎం కేసీఆర్.. మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరానికి ఇతర జిల్లాల నుంచి మెరుగైన వైద్యం కోసం రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు రోజుల తరబడి నగరంలోనే ఉండాల్సి వస్తుంది.
ఈ క్రమంలోనే రోగులకు, వారి సహాయకులకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ. 5 భోజనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రాయితీ భోజనానికి ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 38.66 కోట్లు ఖర్చు చేయనుంది. దాదాపు 20 వేల మందికి ఈ భోజన సదుపాయం కలగనుంది.
ఈ క్రమంలో హైదరాబాద్లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు, సహాయకులుగా వచ్చే వారికి ప్రభుత్వం రూ. 5 లకే నాణ్యమైన భోజనం అందించేందుకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై ప్రభుత్వం తరపున టీఎస్ఎంఎస్ఐడీసీ, హరే కృష్ణ మూమెంట్ సంస్థ కలిసి సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు, వారి సహాయకులకు మూడు పూటలా భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నాణ్యమైన భోజనం అందించే హరే కృష్ణ మూమెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రోగుల సహాయకులు రూ. 5 చెల్లిస్తే, మిగతా రూ. 21.25 లను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. వారం పది రోజుల్లో భోజన సౌకర్యం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను టీఎస్ఎంఎస్ఐడీసీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారం పది రోజుల్లో ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసి, జంటనగరాల్లోని 18 ఆసుపత్రుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వాములను చేసి ఒకే సారి ప్రారంభించడం జరుగుతుందని మంత్రి హరీశ్రావు తెలిపారు.
జీహెచ్ఎంసీలో రూ. 5 లకే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఇప్పటికే పేదలకు ఎలా భోజన సౌకర్యం అందుతుందో, అదేరీతిలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఈ సౌకర్యం వారం పదిరోజుల్లో అందుబాటులోకి రానుంది. ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజిటబుల్ పలావ్, సాంబర్ రైస్తో పాటు పచ్చడి అందిస్తారు. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్లో అన్నం, సాంబర్ లేదా పప్పు, పచ్చడి, సబ్జీ వంటివి వడ్డిస్తారు. డిస్పోజబుల్ ప్లెట్, వాటర్ గ్లాస్ సైతం అందించబడుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ, నీలోఫర్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, కోఠి మెటర్నటీ ఆస్పత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, మలక్పేట ఎంఎన్ ఏరియా ఆస్పత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రుల్లో భోజన సౌకర్యం కల్పించనున్నారు.