తెలంగాణ పట్టణ క్రీడా పథకం ద్వారా ఏర్పాటుకు చర్యలు
డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి : ప్రతి ఒకరిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం నగర ప్రజలకు కల్పించేందుకు తెలంగాణ పట్టణ క్రీడా పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో 450 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు 47 రోజుల పాటు నిర్వహించిన నేపథ్యంలో బుధవారం సికింద్రాబాద్ జోన్ సమ్మర్ కోచింగ్ ముగింపు సమావేశం మారేడ్పల్లి గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జనాదరణ పొందిన క్రీడల్లో నిష్ణాతులైన క్రీడాకారులు రాణించడం, నైపుణ్యత పెంపొందించడం కోసం సీఎం కేసీఆర్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వేసవి శిక్షణ శిబిరాలు 44 ఈవెంట్లతో 47 రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ అర్బన్ క్రీడా ప్రాంగణం కార్యక్రమం ద్వారా వార్డుకు 3 ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు 45 చోట్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాలాపేట్లో నూతనంగా చేపట్టిన స్విమ్మింగ్ పూల్ త్వరలో పూర్తి అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మార్చ్ ఫాస్ట్లో పాల్గొని, జోనల్లోని 113 కేంద్రాల్లో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, ఏఎంహెచ్ఓ రవీందర్ గౌడ్, గేమ్స్ ఇన్స్పెక్టర్ వీరానంద్, కె.శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.