మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 23 : అక్రమంగా మద్యం రవాణా, విక్రయిస్తున్న వారిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి గోవాకు చెందిన 3675 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి కథనం ప్రకారం.. రాజబొల్లారం గ్రామ శివారుల్లో గురువారం సాయంత్రం సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో హోండా యాక్టివా పైన వెళ్తున్న ఇద్దరు జక్కంశెట్టి యుగసాయి కృష్ణ, అల్లి రాజేశ్పై అనుమానం వచ్చి ఆపి ప్రశ్నించారు. వారు గోవాకు చెందిన మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్టు గుర్తించారు. వారి నుంచి ఒక కేసు ఇంపీరియల్ బ్లూ, ఒక కేసు మెన్షన్ హౌజ్ను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కొంపల్లిలోని వారి ఇండ్లల్లో సోదా చేసి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిచ్చిన సమాచారంతో గిర్మాపూర్లోని ముక్కెర సాయిబాబు ఇంట్లో తనిఖీ చేశారు. అక్కడ 62 కేసుల ఇంపీరియల్ బ్లూ మద్యం, 18 కేసుల మెన్షన్ హౌజ్, రాయల్ స్టాగ్ 2 కేసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 90 కేసుల్లో 3675 బాటిళ్లు పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. మరోవ్యక్తి రావెళ్లి రమేశ్ పరారీలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు రాఘవేశ్వర్రావు, యూసుఫ్, సిబ్బంది షాబుద్దీన్, శ్రీనివాస్, శ్రీశైలం, మన్సూర్, భాస్కర్, శోభ తదితరులు పాల్గొన్నారు.