ఎల్బీనగర్, జూలై 10 : సరూర్నగర్ సర్కిల్లో వార్డు కార్యాలయాలకు అందుతున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందిస్తూ సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. సర్కిల్లోని ఐదు డివిజన్లలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. గడ్డిఅన్నారం, చైతన్యపురి వార్డు కార్యాలయాలు కాస్తా ఆలస్యంగా ప్రారంభం కాగా జూన్ 16వ తేదీన కొత్తపేట, సరూర్నగర్, ఆర్కేపురం డివిజన్ల వార్డు కార్యాలయాలు ప్రారంభం అయ్యాయి. కాగా సర్కిల్ వ్యాప్తంగా జూన్ 16 నుంచి జూలై 7వ తేదీ వరకు మొత్తం 362 ఫిర్యాదులు రాగా వాటిలో 336 సమస్యలను పరిష్కారం చేశారు. కాగా మరో 26 పెండింగ్లో ఉన్నాయి. వాటిని మరో రెండు రోజుల్లో పరిష్కారం చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. వార్డు కార్యాలయాలకు ఎక్కువగా శానిటేషన్, వీధి దీపాలు, కుక్కల బెదడ, డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్యలు వస్తున్నాయి. ఫిర్యాదులు అందిన వెంటనే ఆయా వార్డు కార్యాలయాల్లోని సంబంధిత విభాగం అధికారులు సమస్యపై దృష్టి సారించి ఆయా పనులకు నిర్ణయించిన సమయాలకు అనుగుణంగా సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. తాజాగా మరో రెండు వార్డు కార్యాలయాలు ప్రారంభం కావడంతో ఆయా వార్డుల సమస్యలపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
వార్డుల్లో వస్తున్న ఫిర్యాదుల వివరాలను తెలుసుకునేందుకు సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య తరచుగా వార్డు కార్యాలయాలను సందర్శిస్తున్నారు. కొత్తపేట, ఆర్కేపురం, సరూర్నగర్ వార్డు కార్యాలయాలను ఇటివలే సందర్శించి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయో తెలుసుకుని తద్వారా ఫిర్యాదుదారులను కలిసి అధికారుల పనితీరును తెలుసుకోవడంతో పాటు ప్రజల స్పందనను తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు న్యూ మారుతీనగర్, వెంకటేశ్వరకాలనీ, పోచమ్మ బాగ్ కాలనీ, అలుకాపురి కాలనీ వాసులతో ఉప కమిషనర్ నేరుగా, ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యపై అధికారులు, సిబ్బంది ఎలా స్పందించారన్న సమాచారం తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదుదారుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ మేరకు తాము ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించడం పట్ల వార్డు కార్యాలయల పనితీరుపై కాలనీవాసుల్లో సర్వాత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దీనికి అనుగుణంగా అధికారులు కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పాటు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సూచనలతో వార్డు కార్యాలయాల పనితీరు మరింత మెరుగుపర్చేందుకు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తున్నాం
వార్డు కార్యాలయాల ద్వారా డివిజన్లకు సంబంధించిన ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తున్నాం. వార్డు కార్యాలయాలకు అందుతున్న ఫిర్యాదులను సంబంధిత విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేలా చొరవ తీసుకుంటున్నాం. ప్రధానంగా ఫిర్యాదులు ఇచ్చిన వారితో నేరుగా లేదా ఫోన్ల ద్వారా సమస్య పరిష్కారం అయ్యిందా లేదా వారికి వెంటనే స్పందన లభించిందా అన్న విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. వార్డు కార్యాలయాలతో ప్రజల చేరువకు సేవలు అందుతున్నాయి.
– హరికృష్ణయ్య, ఉప కమిషనర్