సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిందని, డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం రూ.3500 కోట్లు వెచ్చిస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో హైదరాబాద్ ఒకటిగా ఉందని తెలిపారు. అలాంటి నగరంలో ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెరుగైన మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. ముఖ్యంగా నగరానికి వెస్ట్జోన్లో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
100శాతం ప్రతి ఇంటికి తాగునీరు
నియోజకవర్గం పరిధిలో ప్రతి ఇంటికి మంచి నీటి పైపులైన్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని, నో నెట్ వర్ ఏరియా ప్రాంతాల్లో కూడా కొత్తగా మంచి నీటి పైపులైన్ ఏర్పాటు చేసి 100శాతం ప్రతి ఇంటికి నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నియోజవర్గంలో అత్యధికంగా లింక్ రోడ్లు ఏర్పాటు చేశామని, ‘ప్రజాహితం, ట్రాఫిక్ రహిత సమాజం’ కోసం మరిన్ని లింక్ రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవసరమైన చోట లింక్ రోడ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
మంత్రికి సమస్యలు వివరించిన గాంధీ
సమావేశంలో భాగంగా మొదట శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పలు అంశాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వీటిలో నల్లగండ్లలో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం, మిషన్ కాకతీయ, చెరువుల సుందరీకరణ, హైదర్నగర్ డివిజన్లోని మోర్ సూపర్ మారెట్ రోడ్డు సమస్య, ఉషాముళ్లపూడి కమాన్ రోడ్డు విస్తరణ, ఆల్విన్ కాలనీ డివిజన్, అపర్ణ నుంచి గంగారాం వరకు రోడ్డు ఏర్పాటు, శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్పూర్ వరకు రోడ్డు నిర్మాణం పనుల ఆలస్యంపై, మురళీధర్ సొసైటీ రోడ్డు, కొత్త రోడ్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సమావేశంలో పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఈఎన్సీ జియావుద్దీన్, సీఈ దేవానంద్, సీసీపీ దేవేందర్ రెడ్డి, ఎస్.ఈ ప్రాజెక్ట్ వెంకటరమణ, జలమండలి డైరెక్టర్ స్వామి, సీజీఎం విజయ్రావు, జీఎం రాజశేఖర్, ఎస్.ఈ శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.