హైదరాబాద్ జనవరి 9 (నమస్తే తెలంగాణ) : దేశ సేవకు అగ్నివీరులు సంసిద్ధంగా ఉన్నారని బ్రిగేడియర్ రాజీవ్ చౌహాన్ అన్నారు. సోమవారం గోల్కొండ ఆర్టిలరీలో శిక్షణ పొందుతున్న 300మంది అగ్నివీరుల శిక్షణ, వసతి, ఇతర సదుపాయల గురించి బ్రిగేడియర్ మీడియాకు వివరించారు. తెలంగాణలో గోల్కొండ ఆర్టిలరీ ఒక ఉత్తమ శిక్షణా కేంద్రమని, ఇక్కడ కఠిన శిక్షణ పొంది, దేశంలోని త్రివిధ దళాల్లో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధమైన అగ్నివీరులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వచ్చే ఫిబ్రవరిలో మరో 3,300 మంది అగ్నివీరులు తయారవుతారని చెప్పారు. ఒక్క గోల్కొండ ఆర్టిలరీ నుంచి దాదాపు 5,500 మంది అగ్నివీరులకు శిక్షణ ఇవ్వనున్నట్టు రాజీవ్ చౌహాన్ తెలిపారు.
కేంద్ర పాలిత ప్రాంతాలు మొదలుకొని దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచీ అగ్నివీరులు శిక్షణ పొందుతున్నారని చెప్పారు. మొదటి బ్యాచ్కు 10 వారాలు ప్రాథమిక ఆర్మీ శిక్షణ, మిగతా 21 వారాలు అడ్వాన్స్ ట్రైనింగ్తో కలిపి 31 వారాల పాటు కఠిన శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అగ్నివీర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలోంచి 25శాతం మందిని శిక్షణకు ఎంపిక చేసినట్టు చెప్పారు. అనంతరం శిక్షణపొందిన తొలి బ్యాచ్లోని నిష్ణాతులైన పదిమంది అగ్నివీర్లను మీడియాకు పరిచయం చేశారు. తర్వాత అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చిన అంశాలు, వారి తరగతి గదులు, ఇతర వసతుల గురించి మీడియాకు క్షుణ్ణంగా వివరించారు.