అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం
మేడ్చల్, మే 24 (నమస్తే తెలంగాణ): మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రూ.30 లక్షలకు పైగా నిధులు అవసరమయ్యే పాఠశాలల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈ మేరకు జిల్లాలో 40 పాఠశాలలకు రూ.30 లక్షలకు మించి నిధులు అవసరం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈనెల చివరి వరకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మొదటి దశలో జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలలోని 15 మండలాల్లో ఉన్న 176 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టానున్నారు. ఈ పాఠశాలలకు ప్రభుత్వం రూ. 70 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మిగతా పాఠశాలల్లో కూడా ఈనెల చివరి వారంలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యా బోధనను ప్రారంభించనున్నారు. అన్ని వసతులు కల్పిస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది.