వెలుగులోకి రూ. 30 కోట్ల స్కానింగ్ స్కామ్
డిజిటలైజేషన్ పేరిట రూ.లక్ష నుంచి రూ. 5.5 లక్షల డిపాజిట్లు
ఒక్కో పేజీకి రూ.5 నుంచి రూ.10 ఇస్తామని ఒప్పందం
డిపాజిట్లు చేసిన 700 మంది
ఆరు నెలల్లో బిచాణా ఎత్తేసిన కంపెనీ
సీసీఎస్లో బాధితుల ఫిర్యాదు
సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ‘పుస్తకాలు స్కాన్ చేసి.. డిజిటలైజేషన్ చేస్తున్నాం.. మీరు మా దగ్గర డిపాజిట్ చేస్తే స్కానర్.. పుస్తకాలు ఇస్తాం.. మీరు స్కాన్ చేసిన కాపీలు మాకు ఇస్తే చాలు..ఒక్కో పేజీకి డిపాజిట్లను బట్టి రూ.5 నుంచి రూ. 10 ఇస్తామం’టూ ఓ సంస్థ చేసిన రూ. 30 కోట్ల కుంభకోణం (స్కానింగ్ స్కామ్) వెలుగులోకి వచ్చింది. మూడు రోజులుగా సంస్థ కార్యాలయానికి తాళం వేసి, నిర్వాహకులు పరారుకావడంతో లబోదిబోమంటూ బాధితులు బుధవారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం… ఉత్తర భారతదేశానికి చెందిన అమిత్ శర్మ, మరికొందరు డిజినల్ ఇండియా(ప్రై) లిమిటెడ్ పేరుతో గ్రీన్ ల్యాండ్స్, బంజారాహిల్స్లోని షాగ్రిల్లా ప్లాజాలో సంస్థను ప్రారంభించారు. అమెరికాకు చెందిన ప్రాజెక్ట్ చేస్తున్నామని, పేపర్లు అన్ని డిజిటలైజేషన్ చేస్తున్నామంటూ.. ప్రకటించుకున్నారు. వివిధ రకాలైన నవలలు, మెడికల్, ఇతర పుస్తకాలను, స్కానింగ్ చేసి, ఆ కాపీలు తమకు అప్పగిస్తే, వాటిని మేం ఇంటర్నెట్లో పెడుతామని, దాని ద్వారా మొత్తం డిజిటలైజేషన్ చేస్తున్నామని నమ్మించారు. వర్క్ ఫ్రం హోంతో తక్కువ డిపాజిట్ చేసి.. 11 నెలల కాల పరిధితో భారీ లాభాలు ఆర్జించండంటూ ప్రచారం చేసుకున్నారు. వీళ్ల మాటలు నమ్మి దాదాపు 700 మంది డిపాజిట్లు చేశారు.
11 నెలల వర్క్.. ఆరునెలల్లో డిపాజిట్ రిటర్న్..
ఈ స్కీమ్లో లక్ష నుంచి 5.50 లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడిని బట్టి.. రూ. 10వేల నుంచి 40 వేల పేజీలు స్కాన్ చేసేందుకు పుస్తకాలు అందించేలా అగ్రిమెంట్లు చేశారు. 11 నెలల పాటు పేజీలు ఇచ్చే విధంగా.. ఆరునెలల్లో డిపాజిట్ తిరిగి ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు. మొదటి నెల బిల్లులు అందుకున్న వారు.. ఎక్కువ స్లాట్లు తీసుకున్నారు. వారి బంధువులు కూడా పెట్టుబడులు పెట్టారు. డిసెంబర్లో ఈ సంస్థ కార్యకలాపాలు మొదట గ్రీన్ల్యాండ్స్లో.. ఆ తరువాత బంజారాహిల్స్లో మరోబ్రాంచిని ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు కొందరు మూడు నాలుగు బిల్లులు కూడా తీసుకున్నారు. డిపాజిట్లు మాత్రం ఎవరూ వెనక్కి తీసుకోలేదు. వాటిని చెల్లించే సమయం రాగానే.. జూలై 1 నుంచి సంస్థ మూత పడింది. భారీగా వచ్చిన కలెక్షన్లతో నిర్వాహకుడు అమిత్ శర్మ బిచాణా ఎత్తేశాడు. సుమారు 700 మంది నుంచి రూ. 30 కోట్ల వరకు అమిత్ శర్మ, అతడి గ్యాంగ్ వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అమిత్ శర్మ భారీ ఎత్తున డిపాజిట్లు వసూలు చేసి ..నార్త్ ఇండియాకు పరారయ్యాడంటూ బాధితులు ఆరోపించారు. రిటైర్డు ఉద్యోగులు, గృహిణిలు, విద్యార్థులు, ఉద్యోగులు వర్క్ఫ్రమ్ హోం అనగానే అప్పులు తెచ్చి, బంగారం కుదవపెట్టి డబ్బులు తెచ్చి కట్టామంటూ బోరుమన్నారు.
2003లో..
2003లో సికింద్రాబాద్లో విన్శ్రీ ఇన్ఫోటెక్ అనే సంస్థ డేటా ఎంట్రీల పేరుతో మోసం చేసింది. అమెరికా నుంచి పుస్తకాలు వస్తున్నాయని, వాటిని డిజిటలైజేషన్ చేయాలని నమ్మించారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 2.5 లక్షల డిపాజిట్లు తీసుకున్నారు. అయితే కోఠిలో దొరికే నవలలు, ఇతర పుస్తకాలు తెచ్చి వాటిని అందిస్తూ..అది అమెరికా ప్రాజెక్ట్ అంటూ నమ్మిస్తూ..నిర్వాహకుడు మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్లో అప్పట్లో కేసు నమోదు చేసి..నిర్వాహకుడితో పాటు మధ్యవర్తులను అరెస్ట్ చేశారు. అలాంటిదే ఇప్పుడు స్కానింగ్ పేరుతో జరిగిన భారీ మోసం బయటపడింది.