హైదరాబాద్ : కూకట్పల్లి పోలీసు స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇతర పోలీసులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల సబ్ ఇన్స్పెక్టర్ను, కానిస్టేబుళ్లను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని కోరారు.
రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 2,295 కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలకు చేరుకున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 1,500 కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 232, రంగారెడ్డిలో 218, హనుమకొండలో 54, సంగారెడ్డిలో 50 కేసులు వెలుగు చూశాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. ప్రతి 10 లక్షల జనాభాకు ఇప్పటివరకు 8.04 లక్షల పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారులు తెలిపారు.
కరోనా వ్యాప్తి పెరుగుతున్నా థర్డ్ వేవ్పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. థర్డ్ వేవ్ను ఎదురొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కోటి హోం ఐసొలేషన్ కిట్లు, రెండు కోట్ల కరోనా నిర్ధారణ కిట్లను ఇప్పటికే రాష్ట్రంలోని పీహెచ్సీలు, సబ్సెంటర్లకు సరఫరా చేసినట్టు తెలిపారు.