సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలుగు సంవత్సరం ఉగాది నుంచి మెట్రో రైలు ప్రయాణికులకు 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రయాణికుల కోసం 3 ఆఫర్లు 6 నెలల పాటు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లను మెట్రో ప్రయాణికులు ఈ నెల 9 నుంచే వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ… మెట్రో ప్రయాణికులకు కోసం ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ సరికొత్తగా కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాంను పరిచయం చేస్తోందన్నారు. ఇందులో తరచుగా మెట్రోలో ప్రయాణించే వారికి పూర్తి ఆకర్షణీయంగా ఉంటుందని, ఎక్కువగా మెట్రో సేవలు వినియోగించుకుంటే ఎక్కువ రివార్డులు పొందవచ్చన్నారు. కొత్తగా ప్రారంభించిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రాం ద్వారా మెట్రో ప్రయాణికులు ఎంతో లబ్ధి పొందుతారని ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు.