వెంగళరావునగర్, ఫిబ్రవరి 8: ఆయుర్వేద వైద్యం పేరుతో నమ్మించి రూ.3 లక్షలకు పైగా మోసానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోకాపేటకు చెందిన సచిన్ గుప్తా తన తండ్రి రామావతార్ గుప్తా (70)కు వెన్ను నొప్పి సమస్య ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు. ఎక్కడ వైద్యం చేయించినా నయం కాలేదు. గత ఏడాది జూలై నెలలో మిషన్ వాక్ ఫిజియోథెరపీ సెంటర్లో ఫిజియోథెరపీ చేయించుకొని వస్తుండగా.. సుధాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తన బాబాయి కూడా ఇలానే వెన్ను నొప్పితో బాధపడుతుంటే ఆయుర్వేద వైద్య విధానం ద్వారా చికిత్స చేయించి నయం చేయించామని నమ్మబలికాడు. తన సోదరుడు వచ్చి మీకు వైద్య విధానం గురించి వివరిస్తాడని తెలిపాడు. మరుసటి రోజు భరత్ అనే వ్యక్తి వచ్చి ఆయుర్వేద వైద్య విధానాన్ని వివరించాడు. అనంతరం కల్యాణ్నగర్ జంక్షన్ వద్దనున్న శారద కాంప్లెక్స్లోని బాలాజీ ఆయుర్వేద దుకాణానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆయుర్వేద వైద్యుడిగా చెప్పుకుంటున్న ఆనంద్కు పరిచయం చేశాడు. వెన్ను నొప్పిని కచ్చితంగా నయం చేస్తామని..
చక్కగా నడవగలరని నమ్మబలికాడు. ఆ ఆయుర్వేద దుకాణంలో ఔషధాల కొనుగోలు కోసం జాబితాను ఇచ్చాడు. మొత్తం రూ. 3,80,814 బిల్లు అయ్యింది. బిల్లు డబ్బును చెక్ ద్వారా చెల్లించాలని, లేని పక్షంలో 24 క్యారట్ల బంగారు బిస్కెట్లు ఇవ్వాలని కోరాడు. ఆయుర్వేద ఔషధాలలో తాము స్వర్ణ భస్మం వాడుతామని, వైద్యానికి పనికి వస్తుందని చెప్పాడు. తాము ఇచ్చిన ఔషధాలతో నయం కాకపోతే.. 85% డబ్బును తిరిగి చెల్లిస్తామంటూ ఇందుకు లిఖిత పూర్వకంగా కూడా రాసి ఇచ్చాడు. వీరి మాటలను నమ్మిన సచిన్ గుప్తా ఆయుర్వేద ఔషధాలను ఇంటికి తీసుకెళ్లి.. తన తండ్రికి చికిత్స చేశారు. నెలలు గడుస్తున్నా ప్రయోజనం కనిపించకపోవడంతో వారిని నిలదీశాడు. కొన్ని రోజులు గడిచాక ఆయుర్వేద దుకాణాన్ని మూసివేసి అక్కడ నుంచి ఉడాయించాడు. జరిగిన మోసం పై బాధితుడు గురువారం మధురానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.