చండీగర్ : కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం హోలీ వేడుకలను నిషేధించింది. ఈ మేరకు హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రాష్ట్రంలో హోలీ వేడుకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. హర్యానాలో ఇప్పటివరకు 2,82,000 కరోనా వైరస్ కేసులు నమోదవగా కొవిడ్-19 కారణంగా 3,100 మంది చనిపోయారు.
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సామూహిక సమావేశాలను ఢిల్లీ, ముంబై ఇప్పటికే నిషేధించాయి. కేంద్ర ఆరోగ్య అదనపు సెక్రటరీ రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాస్తూ సామూహిక సమావేశాలకు అవకాశం ఉన్న హోలీ, షెబ్-ఇ-బరాత్, బిహు, ఈస్టర్, ఈద్-ఉల్-ఫితర్ వంటి స్థానిక వేడుకలపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సూచించారు.