పోచారం, బండ్లగూడ ఫ్లాట్లకు 35 వేల దరఖాస్తులు
త్రీ-బీహెచ్కేలకు 1:30 నిష్పత్తిలో పోటీ
దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ నిర్మించిన ఫ్లాట్ల బహిరంగ వేలానికి దరఖాస్తుల స్వీకరణ తుది దశకు చేరింది. ఫ్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ మే 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా, ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చింది. మొత్తం 2971 త్రీ-బీహెచ్కే, టూ-బీహెచ్కే, వన్-బీహెచ్కే ఫ్లాట్ల కోసం ఇప్పటి వరకు 35వేల దరఖాస్తులు వచ్చాయి. మంగళవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో మరో 500 నుంచి 1000 మధ్యలో దరఖాస్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బండ్లగూడలో 1501 ఫ్లాట్ల కోసం 29,800, పోచారంలో 1470 ఫ్లాట్లకు 5,300 దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలో త్రీబీహెచ్కే ఒక్క ఫ్లాట్కు 1:30, పోచారంలో 1:20 నిష్పత్తిలో పోటీ పడనున్నారు. ఒక్కో టూ-బీహెచ్కే బండ్లగూడలో 1:9, పోచారంలో 1:3 నిష్పత్తిలో అప్లికేషన్లు వచ్చాయి. ఇక వన్బీహెచ్కు ఇప్పటి వరకూ 1:1 నిష్పత్తిలోనే దరఖాస్తులు వచ్చాయి. అంటే వన్బీహెచ్కే కోసం దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు ఫ్లాట్ దక్కించుకునే అవకాశం ఉంది. చివరి రోజు ఏమైనా దరఖాస్తులు వస్తే మాత్రం స్వల్పపోటీ ఉంటుంది.
ఈ నెల 22న కేటాయింపు..
ఈ నెల 22న ఆన్లైన్ లాటరీ సిస్టమ్లో ఫ్లాట్లను వేలం వేస్తారు. లాటరీలో ఎంపికయ్యే వారు వారం రోజులలోపు టోకెన్ అడ్వాన్స్గా అమ్మకపు ధరలో 10శాతం చెల్లించాల్సి ఉంటుంది. అలాట్మెంట్ లెటర్ జారీ తేదీ నుంచి 60 రోజుల్లోపు సేల్వ్యాల్యూలో 80శాతం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా, మరో 30 రోజుల్లో ఫైనల్ ఇన్స్టాల్మెంట్గా మిగిలిన మొత్తం చెల్లించాలి. గడువులోపు చెల్లింపులు చేయని పక్షంలో 10శాతం టోకెన్ అడ్వాన్స్ కూడా కోల్పోతారు. అయితే ఫ్లాట్ల ధరలో 80శాతం వరకు బ్యాంక్లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది.