ఇద్దరు ఖాతాదారుల పాత్రలేనట్లే..
కీలకంగా మారిన ఆమె అకౌంట్
ఈశాన్య రాష్ర్టాలకు ప్రత్యేక బృందాలు
ముమ్మరంగా ‘మహేశ్ బ్యాంక్’దోపిడీ కేసు దర్యాప్తు
సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): మహేశ్ బ్యాంక్ సైబర్ దోపిడీ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో గాంధీనగర్కు చెందిన ఓ ఇంటర్నెట్ కేంద్ర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేఫ్కు సంబంధించిన ఐపీ చిరునామా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో హ్యాకర్లకు, ఇంటర్నెట్ కేఫ్కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అయితే హ్యాకర్లు ప్రాక్సీ సర్వర్ వాడడంతో.. దాని ఐడీని నేరగాళ్లకు ఇచ్చే అవకాశముంది. ఈ ఐపీ ఎలా వెళ్లింది..? ఇంటర్నెట్ కేఫ్ నిర్వాహకులతో ఏమైనా లింక్లున్నాయా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఇంటర్నెట్ కేఫ్ వద్ద ఓపెన్ వైఫై కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు మహేశ్ బ్యాంక్లో డబ్బు డిపాజిట్ అయిన ఖాతాల్లోని ఇద్దరిని పోలీసులు విచారించి, వారికి ప్రమేయం లేదని నిర్ధారణకు వచ్చారు. షానవాజ్ బేగం అనే మహిళ ఖాతాలోనే సుమారు రూ. 6.5 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఆమె ఈ నెల 11నే అకౌంట్ తెరిచింది. దీంతో హ్యాకర్లతో ఆమెకు సంబంధాలుండే అవకాశాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈశాన్య రాష్ర్టాలకు..
హ్యాకర్ల ముఠా పక్కా ప్లాన్తో బ్యాంకు సర్వర్పై దాడి చేసింది. ఇందులో భాగంగానే ఈశాన్య రాష్ర్టాల్లోని బ్యాం కు ఖాతాలనే ఎక్కువగా వాడేసింది. 129 అకౌంట్లకే హ్యాకర్లు పరిమితం కాలేదు.. ఇంకా వందల బ్యాంకు ఖాతాలను వీళ్లు ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఖాతాదారులతో పాటు ఏజెంట్లను విచారిస్తే.. హ్యాకర్లకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఈశాన్య రాష్ర్టాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు సర్వర్ భద్రతపై మహేశ్ బ్యాంక్లో ఆడిటింగ్ జరిగింది. ఈ రిపోర్టును సైబర్క్రైమ్ పోలీసులు పరిశీలించారు. సర్వర్ నిర్వహణలో భద్రత లోపాలు ఎక్కడున్నాయనే విషయంపై ఆరా తీశారు. శుక్రవారం బ్యాంకు అధికారులను పిలిపించిన సైబర్క్రైమ్ పోలీసులు.. పలు వివరాలను సేకరించారు.