నేడు మహేశ్వరంలో మంత్రి కేటీఆర్ పర్యటన
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, జనవరి 28: మహేశ్వరం నియోజకవర్గంలో రూ.371 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం వస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో రూ.4.50 కోట్లతో సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులు, రూ.29 కోట్లతో నీటి పైపులైన్లు, రిజర్వాయర్ల పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. జల్పల్లి మున్సిపాలిటీలో రూ.72 కోట్లతో వాటర్లైన్లు, రూ.7కోట్ల హెచ్ఎండీఏ నిధులతో చేపట్టే రోడ్డు వెడల్పు, టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టే రోడ్ల వెడల్పు పనులు, పహాడీషరీఫ్ రోడ్డు విస్తరణ పనులు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు, రాక్ గార్డెన్ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు.మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి లైన్లకోసం, బాక్స్ డ్రైనేజీ పనులు, అల్మాస్ గూడ కమాన్ నుంచి జిల్లెలగూడ కనకదుర్గ ఆలయం వరకు కోటి 50 లక్షలతో బాలాపూర్ క్రాస్రోడ్డు నుంచి బాలాపూర్ కమాన్ వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ప్రశాంతి హిల్స్ నుంచి విజ్ఞాన్పురి కాలనీ హనుమాన్ మందిరం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి, సమీకృత మార్కెట్ సముదాయాలకు భూమి పూజ చేస్తారని చెప్పారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 82 కోట్లతో తాగునీటి పథకం పనులు, సమీకృత మార్కెట్ పనులు, రోడ్డు వెడల్పు పనులు, అల్మాస్గూడ,బడంగ్పేట్లలో ఓపెన్ నాలాల నిర్మాణానికి శంకుస్థాపనలు ఉంటాయని చెప్పారు.