సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ)/చార్మినార్ : వచ్చే నెల 16న జరిగే పాత నగరం ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.250 కోట్లతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం సాలార్జంగ్ మ్యూజియంలో పాత నగరం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంసృతికి ప్రతీకగా నిలిచే బోనాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని, నాటి నుంచి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తున్నదని వివరించారు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వివిధ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు.
13వ తేదీలోపు పనులన్నీ పూర్తి..
ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగేలా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు , శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లను అందుబాటులో ఉంచుతామని పేరొన్నారు. భక్తులకు తాగునీరు, రహదారుల మరమ్మతులు, వాటర్, సీవరేజ్ లైన్ వంటి అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే వచ్చే నెల 13వ తేదీలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆలయ పరిసరాలు, కాలనీలు, రోడ్లపై చెత్త లేకుండా తొలగించాలని తెలిపారు.ఈ సమావేశంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ ఆలె భాసర్ రాజ్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వాటర్ వర్స్ డైరెక్టర్ కృష్ణ, సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ హఫీజుద్దిన్, టూరిజం ఎండీ మనోహర్, ట్రాన్స్కో ఎస్ఈ అబ్దుల్ రహమాన్, దేవాలయాల కమిటీ ప్రతినిధులు, శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఊరేగింపుల్లో.. ఇబ్బందులు రావొద్దు..
అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలిగేలా చూడాలని సంబంధిత అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. అకన్న మాదన్న, సబ్జిమండి ఆలయాలకు అమ్మవార్ల ఊరేగింపు కోసం అంబారి (ఏనుగు)ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశా రు. వివిధ ప్రాంతాల్లోని ప్రజలు టీవీల్లో వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 17 వ తేదీన అకన్న మాదన్న దేవాలయం నుంచి ఢిల్లీ దర్వాజ వరకు నిర్వహించే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపునకు కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఊరేగింపును కొంచెం త్వరగా ప్రారంభించాలని నిర్వాహకులను మంత్రి కోరారు. కిందకు వేలాడుతూ ఉండే విద్యుత్ తీగలను తొలగించాలని, అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. దమయంతి భవన్, ఢిల్లీ దర్వాజల వద్ద త్రిడీ మ్యాపింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహించామని వివరించారు.