సిటీబ్యూరో, జనవరి 11(నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున గ్రేటర్ వ్యాప్తంగా రవాణా అధికారుల బృందాలు పలు ప్రాంతాల్లో నిఘా వేసి వాహనాలను తనిఖీ చేశారు. వందలాది ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసి..రూల్స్కు వ్యతిరేకంగా నడుస్తున్న 25 బస్సులను సీజ్ చేశారు. మరికొన్ని ట్రావెల్ బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు రవాణా శాఖ దృష్టికి వచ్చింది. రూ.350 టికెట్ను రూ. 1000 విక్రయించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం తదితర మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో తనిఖీలు చేపట్టారు.
నిబంధనలు పాటించకపోతే చర్యలు
కొంతమంది ట్రావెల్స్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను నడపడం, ఫిట్నెస్ లేకపోయినా వందల కిలో మీటర్ల డెస్టినేషన్స్ కోసం వాటిని వినియోగిస్తున్న ట్రావెల్స్పై చర్యలు తీసుకున్నాం. రంగారెడ్డి పరిధిలో 6 బస్సులను సీజ్ చేశాం. మరో 8 బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశాం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం.
-ప్రవీణ్ రావు, డీటీఓ, రంగారెడ్డి