Crime News | ఖైరతాబాద్, ఫిబ్రవరి 25 : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంతకం ఫోర్జరీ అయ్యింది. నిందితుడు అతడి డాక్యుమెంట్స్ను దుర్వినియోగం చేసి.. రుణం తీసుకొని వాయిదాలు కట్టకపోవడంతో విషయం వెలుగు చూసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్హాట్కు చెందిన సయ్యద్ అహ్మద్ విద్యుత్ శాఖ ఉద్యోగి. అతడికి సుధీర్రెడ్డి అనే ఓ వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్గా పరిచయమయ్యాడు. ఐటీ చెల్లింపులు, తదితర లావాదేవీలు చేస్తానని, ఒరిజనల్ ఆధార్, పాన్కార్డు, ఇతర పత్రాలు ఇవ్వాలని కోరాడు.
అతడి మాటలు నమ్మిన బాధితుడు ఆ పత్రాలను అప్పగించాడు. దీంతో అవే పత్రాలను సోమాజిగూడలోని బజాజ్ ఫైనాన్స్లో పెట్టి, సంతకాలు ఫోర్జరీ చేసి.. రూ.25 లక్షల రుణం తీసుకున్నాడు. కొంత కాలానికి రుణాలకు సంబంధించిన వడ్డీలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు సయ్యద్ అహ్మద్ను సంప్రదించారు. తనను సుధీర్ రెడ్డి మోసం చేశాడని బాధితుడు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.