బంజారాహిల్స్, నవంబర్ 14: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పరిమితికి మించి మద్యం తరలిస్తున్న వ్యక్తితో పాటు మద్యాన్ని అమ్మిన లిక్కర్ స్టోర్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. కావూరి హిల్స్లో నివాసముంటున్న ఓ వ్యక్తి సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లోని ఒక లిక్కర్ స్టోర్ నుంచి 24 బీర్ బాటిళ్లు, 10 బ్రీజర్ బాటిళ్లతో సహా మొత్తం 37 మద్యం బాటిళ్లను కొనుగోలు చేశారు. వాటిని కారులో తరలిస్తూ వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. నిందితుడితో పాటు పరిమితికి మించి లిక్కర్ విక్రయించిన సదరు స్టోర్ యాజమాన్యంపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు