మహానగర శివారు ప్రజల దాహార్తికి శాశ్వత విముక్తి లభించింది. శరవేగంగా విస్తరిస్తున్న మహా నగరంలో ప్రజలకు జలమండలి సమృద్ధిగా నీరందిస్తున్నది. ఫేజ్ -1 కింద 193 గ్రామాలకు రూ.750 కోట్లు ఖర్చు పెట్టి 164 రిజర్వాయర్లు, 1571 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి దాహార్తిని దూరం చేసింది. ఇదే క్రమంలో కోర్ సిటీ తరహాలోనే శివారు ప్రాంతాల్లోనే పుష్కలంగా తాగునీటి అందించేందుకుగానూ జలమండలి ఓఆర్ఆర్ ఫేజ్-2 పథకానికి అంకురార్పణ చేసింది. ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకుగానూ రూ. 1200కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులు ప్రారంభించింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల్లో రెండు ప్యాకేజీలుగా విభజించి 73 రిజర్వాయర్ల పనులు చేపట్టి దాదాపు ప్రాజెక్టును తుది దశకు చేర్చారు.
ఇందులో పూర్తయిన 23 చోట్ల రిజర్వాయర్లను సోమవారం ఒకే రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఇందులో తుక్కుగూడ రిజర్వాయర్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పీర్జాదిగూడ, ద్వారకాపురి కాలనీ, అపెరల్ పార్కు రిజర్వాయర్లను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఇక ఇబ్రహీపట్నంలోని తట్టి అన్నారం, సీఎన్ క్రికెట్ స్టేడియం, ఆదిబట్ల రిజర్వాయర్లను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీరంగూడ-పీజేఆర్ కాలనీ రిజర్వాయర్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్లోని కిస్మత్పూర్, అభ్యుదయ నగర్, బైరాగిగూడ, గండిపేట్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిర్మించిన రిజర్వాయర్లను ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, కొంపల్లి మున్సిపాలిటీ అపర్ణ ఫాంగ్రోస్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. 41 కోట్ల లీటర్ల సామర్థ్యంతో 23 రిజర్వాయర్లు అందుబాటులోకి రావడం ద్వారా లక్షలాది కుటుంబాలకు లబ్ధి జరగనున్నది.
నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు మరో 23 రిజర్వాయర్లు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, పటాన్చెరు నియోజకవర్గాల పరిధిలో ఔటర్ రింగ్రోడ్డు లోపలి ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఈ రిజర్వాయర్లను మంత్రులు మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఇప్పటికే ఔటర్ రింగ్రోడ్డు లోపల 193 గ్రామాలకు మెరుగైన నీటి సరఫరా కోసం రూ.750 కోట్లతో 164 రిజర్వాయర్లు, 1,571 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మించి దాహార్తిని తీరుస్తున్నారు. ఓఆర్ఆర్ ఫేజ్-2లో భాగంగా జలమండలి ఆధ్వర్యంలో రూ.1,200 కోట్లతో 73 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టగా, ప్రస్తుతం 23 అందుబాటులోకి వచ్చాయి.