సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నేపథ్యంలో నగరంలో తిరుగాల్సిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేస్తూ శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి జూలై 2 వరకు ఏడు రోజులు ఈ సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి-హైదరాబాద్, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశామని, రైళ్ల రద్దు వల్ల నగర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన ఎనిమిది రైళ్లను రద్దు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో ఈ రైళ్ల రద్దు కొనసాగుతుందన్నారు. షాలిమార్- హైదరాబాద్, సత్రగచి-తిరుపతి, హౌరా-పుదుచ్చేరి, చెన్నై-సత్రగచి, మైసూర్-హౌరా, తిరుపతి-సత్రగచి, ఎర్నాకులం-హౌరా స్టేషన్ల పరిధిలో రైళ్లు రద్దయ్యాయన్నారు.
గుంతకల్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల వల్ల తిరుపతి-కట్పడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే, ఎనిమిది రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ ఆధ్వర్యంలో 36 రైల్ సర్వీసులను రద్దు చేస్తూ శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రద్దు చేసిన వాటిలో అన్ రిజర్వుడ్ రైళ్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 26 నుంచి జూలై 2 వరకు 36 రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు.