హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బడ్జెట్లో రూ.3వేల కోట్లు ఇచ్చింది. మహిళా సంఘాలు తీసుకునే వడ్డీలేని రుణాల కోసం వీటిని కేటాయించింది. రాష్ట్రం లో మహిళాసంఘాల సభ్యులు వారికాళ్ల మీద వాళ్లు నిలబడటానికి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తున్నది. తీసుకున్న రుణాలకు వడ్డీ భారం కాకుండా దానిని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ప్రతి సంఘం రూ.5 లక్షల వరకు తీసుకునే రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే మహిళా సంఘాలకు చెల్లిస్తుంది. మహిళా సంఘాలకు టర్మ్ లోన్, క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. రాష్ట్రంలో 4.29లక్షల మహిళా సంఘాలున్నాయి. ఇందులో 46.65 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఈ ఏడాది వివిధ బ్యాంకుల ద్వారా రూ.9,803 కోట్ల రుణాలు అందించారు. కాగా, ఈ రుణాల రికవరీ శాతం 97.25 శాతం ఉన్నది. ఏ రంగంలో చూసినా.. బ్యాంకు రుణాల తిరిగి చెల్లింపుల్లో ఇంతశాతం రికవరీ ఎక్కడా లేదు. దీంతో బ్యాంకులు కూడా మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఒకేసారి వడ్డీ లేని రుణాలను ఇంత పెద్దమొత్తంలో విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.