బడంగ్పేట, అక్టోబర్ 18 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి గడపకూ అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తుక్కుగూడకు చెందిన 200 మంది బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో బీజేపీకి గడ్డు కాలం తప్పదని, ఆ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగి నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేదలకు సంబంధించిన అనేక పథకాలను ప్రకటించారని , ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో నిర్ణయించాలన్నారు. ఇతర పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఓట్లు అడగడానికి వస్తున్న వారు ఏం చేస్తారో ప్రజలకు చెప్పడం లేదన్నారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి ,కౌన్సిలర్లు రవినాయక్, సుమన్, బీఆర్ఎస్ పార్టీ తుక్కుగూడ అధ్యక్షుడు లక్ష్మయ్య, యూత్ అధ్యక్షుడు సామేల్ రాజు, బీఆర్ఎస్ నాయకులు రాజు మురాజ్, సురేశ్ ,నర్సింహారెడ్డి, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, శ్రీలత, పద్మ తదితరులు ఉన్నారు.