సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్న్యూ), లంగర్హౌస్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హెచ్న్యూ డీసీపీ చక్రవర్త్తి గుమ్మి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, రాజమండ్రికి చెందిన శ్రీనివాస్రావు ఐచర్ డీసీపీ డ్రైవర్గా పని చేస్తుండగా, సత్తిబాబు క్లీనర్గా పని చేస్తున్నాడు. వీరికి సీలెర్కు చెందిన పాండు, నగేశ్లతో పరిచయం ఏర్పడింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు గంజాయి సరఫరా చేస్తే ఒక్క ట్రిప్కు రూ.1.2 లక్షలు ఇస్తామంటూ శ్రీనివాస్రావుతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఎవరు గుర్తుపట్టకుండా ఉండేలా డీసీఎం క్యాబిన్పైన ఒక ప్రత్యేక బాక్స్ను తయారు చేసి, బయటకు కన్పించకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అందులో గంజాయి ప్యాకెట్లు నింపి, బయట సాధారణ వాహనంలా రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వచ్చారు.
డీసీఎం డ్రైవర్ దీనిని హైదరాబాద్కు చెందిన మహ్మద్ హబీబ్, ప్రవీజ్లకు అందజేయాల్సి ఉన్నది. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం అందుకున్న హెచ్న్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం లంగర్హౌస్ పోలీసులతో కలిసి అత్తాపూర్లో నిఘా వేసి గంజాయి చేతులు మారే సమయంలో డ్రైవర్ శ్రీనివాస్రావు, క్లీనర్ సత్తిబాబు, డ్రగ్స్ తీసుకోవడం కోసం వచ్చిన మహ్మద్ హబీబీలను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ఉస్మాన్బాద్కు ఈ గంజాయిని చేరవేసేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పర్వీజ్, జావెద్, మహారాష్ట్రకు చెందిన మంగేశ్, ఏపీకి చెందిన నగేశ్, పాండులు పరారీలో ఉన్నారు.