హైదరాబాద్ : ఆ పసిపాప చేసిన నేరమేంటి? ఆడబిడ్డగా పుట్టడమేనా? అయితేనేం బాధ్యతగా కనుకున్న తల్లిదండ్రులే కదా..? మరి తమ బాధ్యతలను మరిచి, ఆ పసిగుడ్డును విక్రయిస్తారా? ఇదెక్కడి ఘోరం.. అయ్యో రామా అంటూ అమ్మమ్మ.. ఆ పసిపాప విక్రయాన్ని వెలుగులోకి తెచ్చింది.
వనస్థలిపురానికి చెందిన దుర్గాప్రియ అనే మహిళ గత నెల 21న ఆడపిల్లకు జన్మనిచ్చింది. మూడోసారి ఆడపిల్ల పుట్టడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మొదటి రెండు కాన్పుల్లో కూడా అమ్మాయిలే జన్మించడంతో.. మూడో కాన్పులో పుట్టిన ఆడ శిశువును బాలానగర్కు చెందిన కవితకు రూ. 80 వేలకు విక్రయించారు. విషయం తెలుసుకున్న చిన్నారి అమ్మమ్మ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు విచారణ జరిపి, శిశువును స్వాధీనం చేసుకుని చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.