హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో ( Jubilee hills) అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వేగంగా దూసుకొచ్చిన కారు.. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిలో ఉన్న రెండున్నరేండ్ల బాబు కిందపడిపోయాడు. తలకి తీవ్రంగా గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మహిళ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను దవాఖానకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారుపై నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉన్నది.