హైదరాబాద్ : పంజాగుట్ట బాలిక హత్య కేసులో పురోగతి లభించింది. బాలిక హత్య కేసులో పంజాగుట్ట పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. మహిళతో పాటు మరో వ్యక్తిని కర్ణాటకలో అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. బాలిక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో నిరుపయోగంగా ఉన్న షట్టర్ గది వద్ద ఈ నెల 4వ తేదీన ఉదయం ఓ బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
బాలిక మృతదేహంపై గులాబీ రంగు పైజామా, బూడిద రంగు టీషర్టు, పచ్చరంగు మాస్కు, ముఖంపై పెద్దలు వేసుకునే మంకీ క్యాప్ ఉన్నది. ముఖంపై కమిలిన గాయాలతో పాటు కుడి చేయి విరిచినట్లు ఉండటంతో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. బాలిక ఒంటిపై పాత గాయాలు కూడా ఉన్నాయి. బాలికను గత కొన్ని రోజులుగా చిత్ర హింసలకు గురిచేసినట్లు కనిపిస్తున్నదని పోలీసులు నిర్ధారించారు.
బాలిక మృతదేహం లభ్యమైన ప్రాంతంలో ఖాళీ మద్యం బాటిళ్లతో కూడిన ఓ పెద్ద క్యారీ బ్యాగు ఉన్నది. పాపను చంపి మద్యం సేవించి వెళ్లారా..? లేక.. తాజాగా ఎవరైనా పెట్టారా..? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఎక్కడో హత్య చేసి పసిపాప మృతదేహాన్ని ఇక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పాప కడుపులో, వీపులో బలంగా దెబ్బలున్నాయని, భుజం వద్ద వెముక విరిగినట్లు పోస్టుమార్టంలో బయటపడినట్లు తెలిసింది.
ఈ కేసును చేధించేందుకు ఎనిమిది పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తులో భాగంగా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఇటీవల ఐదేండ్ల పిల్లల మిస్సింగ్కు సంబంధించిన కేసులను పరిశీలించారు. రాజేంద్రనగర్ పీఎస్లో ఒక మిస్సింగ్ ఉండటంతో అక్కడకు వెళ్లి పరిశీలించారు. అయితే, ఆ ఘటనకు, పంజాగుట్ట ఘటనకు పోలిక లేదు. ఘటనా స్థలం, పరిసర ప్రాంతాల్లోని 100 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ రూట్లో వెళ్లిన దాదాపు 120 ఆటోలను కూడా పోలీసులు పరిశీలించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవు. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీంచారు.