సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్కాడ్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ.2.86 కోట్ల నగదును సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ తెలిపారు. రూ.51.76 లక్షల విలువ గల ఇతర వస్తువులను పట్టుకున్నట్లు ఆయన వివరించారు.
11 కేసుల్లో రూ. 50వేలకు మించి, ఆధారాలు లేని రూ.80,03,590 నగదు సీజ్ చేయగా, 9 కేసులకు సంబంధించి రూ.20,74,590 విడుదల చేసినట్లు రోనాల్డ్ రాస్ తెలిపారు. సీజ్ చేసిన నగదులో రూ.10 లక్షలకు మించి పట్టుబడిన రెండు కేసులను ఐటీ శాఖకు బదిలీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 10 కేసుల్లో రూ.77,03,590 సీజ్ చేయగా, 8 కేసులకు సంబంధించి రూ.17,74,590 నగదు రిలీజ్ చేశామని, రూ.59,29,000 నగదుకు సంబంధించి రెండు కేసులను ఐటీ శాఖకు పంపినట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కేసులో రూ.3 లక్షలు సీజ్ చేయగా, సరైన ఆధారాలు సమర్పించడంతో విడుదల చేశామని తెలిపారు. అత్యవసరమైన కేసులను (పర్యాటకులు) వెంటనే పరిశీలించి నగదును విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ 9618888110, కమిటీ కన్వీనర్ మొబైల్ నంబర్ 9177872249లో సంప్రదించాలని సూచించారు.