నూతన విద్యావిధానంతో బంగారు భవిష్యత్తు
సర్కార్ బడులకు మహర్దశ
మన ఊరు- మన బడితో సకల సౌకర్యాలు
మారుతున్న పాఠశాలల రూపురేకలు
మండలంలో 19 పాఠశాలలు ఎంపిక
మహేశ్వరం, మే 31: మన ఊరు- మనబడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నది. విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలలో మౌలిక వసతులను సమకూరుస్తున్నారు. ఇప్పటికే మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థలో చేరుకున్న భవనాలు, నిర్మాణాలను తొలగించి నూతన భవనాల ఏర్పాటు కోసం అంచనా వ్యయంతో పక్కా ప్రణాళికలను తయారు చేస్తున్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి, పనులు చేస్తున్నారు. మన ఊరు- మనబడికి మండలంలో మొత్తం 19 పాఠశాలలు ఎంపికైనట్లు మండల విద్యాధికారులు తెలిపారు. పాఠశాలలో 12 అంశాలపై మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, క్రీడామైదానం వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో మౌలిక వసతులు కలిపిస్తుండటంతో ఆయా గ్రామాల రూపురేకలు మారుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలకు మంచి రోజులు
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం, విద్యాశాఖ కృషి చేస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనులు ప్రారంభిస్తున్నాం. ఆయా గ్రామాల్లో సర్పంచులు పాఠశాలల్లో జరుగుతున్న పనులను ప్రారంభించి, ప్రతిరోజూ పరిశీలిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు, ఉపాధ్యాయులు, పంచాయతి పాలక వర్గాలు కృషి చేయాలి. మన ఊరు- మనబడిలో ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజల సహకారం ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు బోధనను ప్రవేశపెడుతున్నాము. మండలంలో 19 పాఠశాలలు ఎంపిక చేశాం.
– కృష్ణయ్య, ఎంఈవో
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనను ప్రవేశపెడుతున్నారు. మన ఊరు- మన బడితో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. మంచి వాతావరణంలో విద్యార్థులు చదువుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నైపుణ్యతగల ఉపాధ్యాయులు ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపి డబ్బులను వృథా చేసుకోవద్దు. మన ఊరు- మనబడిలో గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులుగా ప్రతి ఒక్క బాల, బాలికలను తీర్చిదిద్దాలి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మహేశ్వరం మండలంలో మొత్తం 19 పాఠశాలలు మన ఊరు- మన బడికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
– కరోళ్ల ప్రియాంక రాజేశ్, సర్పంచ్ మహేశ్వరం గ్రామం